సూచనలు: ఈ క్రింది ఇవ్వబడిన అంశాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి.
ఋగ్వేదాన్ని రెండు విధాలుగా విభాగించడం సంప్రదాయం. ఒక పద్దతి ప్రకారం దాన్ని ఎనిమిది అష్టకాలుగా విభాగిస్తారు. మరొక పద్ధతి ప్రకారం పది మండలాలుగా విభాగిస్తారు. ఈ రెండో పద్దత ఎక్కువ వాడుకలో ఉంది.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఋగ్వేదశాకలశాఖ సంహిత లో పది మండలాలున్నాయి. వాటిని మొత్తం 85 అనువాకాలుగా విభజించారు. వాటిలో 11 వాలఖిల్య సూక్తాలనబడే వాటితో కలిపి 1028 సూక్తాలు ఉన్నాయి. అవి కాక ఖిల సూక్తాలు అనబడే 32 తో కలిపి మొత్తం 1060 సూక్తాలు అవుతాయి. అన్ని సూక్తాలతోను కలిపి మొత్తం 10,580 ఋక్కులు ఉన్నాయి.
అష్టకాల లెక్కలో చూస్తే ఋగ్వేదంలో ఎనిమిది అష్టకాలు, ప్రతి అష్టకానికి 8 అధ్యాయాలు, ప్రతి అధ్యాయానికి అనియత సంఖ్యలో మొత్తం 2008 వర్గులు ఉన్నాయి.
ఒక మండలానికి ఇన్ని సూక్తాలు, ప్రతి సూక్తానికి ఇన్ని ఋక్కులు ఉండాలన్న నియమం లేదు, కాని ఒక విశేషం ఏమిటి అంటే ఋగ్వేద ప్రదమ మండలంలో 191 సూక్తాలు ఉండగా, ఆఖరిదైన పదవ మండలంలో కూడా 191 సూక్తాలే ఉన్నాయి. ఆఖరున వచ్చి చేరిన మండలం కనుక సరిగా ప్రధమ మండలం లో ఎన్ని ఉన్నాయో అన్నే సూక్తాలను దశమ మండలంలో కూడా చేర్చి వుండవచ్చునట.
ప్రతి సూక్తంలోను కొన్ని ఋక్కులు ఉంటాయి కదా? అని సాధారణంగా ఒకే చందస్సులో వుంటాయి. ఒక సూక్తంలోని ఋక్కులన్ని అనుష్టుప్ లో వుంటే మరొక సూక్తంలోని ఋక్కులన్ని జగతీచ్చందస్సులో వుండవచ్చు.
ప్రతి సూక్తానికి ఒక ఋషి ద్రష్టగా వుంటాడు. అంటే ఆ సూక్తాలన్ని ఆ ఋషి దర్శించాడన్న మాట (వ్రాసాడని అనకుడదట సంప్రదాయం ప్రకారం. దీన్ని తర్వాత చర్చిద్దాము) ఋగ్వేద మంత్రాల మొత్తం ద్రష్టలు 391 మంది.
అలాగే ప్రతి సూక్తానికి ఒక దేవత వుంటాడు, లేక వుంటుంది. అంటే ఆ సూక్తం ఆ దేవతని ఉద్దేశించి స్తోత్రం చేస్తూ చెప్పినదన్న మాట. ఉదాహరణకు ఋగ్వేదం ప్రదమ మండల ప్రధమ సూక్తం అగ్ని దేవతకమైనది. అంటే అగ్ని దేవుని ఉద్దేశించి చెప్పినది. దాని ద్రష్ట విశ్వా మిత్ర పుత్రుడైన మధుచ్చందసుడు. దాని ఛందస్సు గాయత్రీ. ప్రప్రధమ సూక్తమే అగ్నికి అంకితమైంది. అంతేకాదు పదిమండలాల లోను ఎనిమిదవ, తొమ్మిదవ మండలాలు తప్ప మిగిలినవన్నీ అగ్ని దేవతాకమైనవి. దాన్ని బట్టి ఆనాటి ఋషులు అగ్నికి ఎంత ప్రాధాన్యమిచ్చారో గ్రహించవచ్చు.
ఋగ్వేదంలో మొట్టమొదటి సూక్తంలో అగ్ని దేవతాకమైన తొమ్మిది ఋక్కులలో మొదటిది ఈ విధంగా వుంటుంది.
అగ్ని మీళ పురోహితమ్
యజ్ఞస్య దేవా మృత్విజమ్
హెూతారమ్ రత్నధాతమమ్
ఋగ్వేద ఋషులకు గాయత్రీ చ్చందస్సు చాల ప్రీతిపాత్రమైనదై వుండాలి. మొత్తం 10580 ఋక్కులు కాగా. ఆ చందస్సులో 2451 ఋక్కులున్నాయి.సుప్రసిద్ధ సంధ్య వందన మంత్రం గాయత్రీ చందస్సీ.
మరొక ముఖ్యవిశేషం ప్రదమ మండలం లోని 191 సూక్తాలను పలువురు మహర్షులు దర్శించారు. అవన్నీ విభిన్న దేవతలకు అంకితమైనట్టివి. అలాగే 8,9,10 మండలాలకు కుడా ద్రష్టలైన పలువురు ఋషులున్నారు. తొమ్మిదవ మండలానికి ద్రష్టలు పలువురైనప్పటికీ దేవత మాత్రం ఒక్కడే. అతడు పవమాన సోముడు, ఒక్క ఆ దేవుని కోసమే ఆ మండలం అంత అంకితమైంది.
ఇక రెండు నుంచి ఏడు వరకు మండలలన్నిటికీ ద్రష్టలు ఒకే ఋషి. లేదా అతని వారసులు, వంశికులు మాత్రమే.ఉదాహరణకు ద్వితీయ మండలమంతా గృత్సమద మహర్షి దర్శించినట్టివి త్రితియ మండలం విశ్వామిత్రుడు, లేదా విస్వమిత్రులైన ఋషులు దర్శించినట్టివి. చతుర్ధ మండలం వామ దేవునికి సంబంధించినది. పంచమ మండలం అత్రి మహర్షికి, లేదా అత్రేయులైన వారికి, షష్ఠమ మండలం భరద్వాజ మహర్షికి లేదా భారద్వాజులైన వారికి సంబందించినవి. కాగా 104 సూక్తాలు కలిగిన సప్తమ మండలం అంత వశిష్ఠుడు ద్రష్టగా కలిగినట్టిది. అయితే విటన్నిటిలోను కొద్దిపాటు సూక్తాలు ఇతరులవి కూడా వున్నాయి.
నాలుగు వేదాలలోను మోదటిదైన ఋగ్వేదం, ఆఖరిదైన అధర్వవేదం మాత్రమే చారిత్రిక, సాంస్కృతిక దృష్టి నుంచి ముఖ్య మైనవి కనుక వాటిని గురించి మరి కొంత వివరంగా తర్వాత చూద్దాము.