1757 ప్లాసీ యుద్దంలోని సిరాజుద్దౌలాను బ్రిటీష్ వారు ఓడించినప్పటి నుంచి భారదేశంలో బ్రిటీష్ పాలన ప్రారంభమయింది. కాని బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం ఊపందుకున్నది మాత్రం 19 వ శతాబ్ది ఉత్తరార్థం నుంచి.
సాహిత్యంలో దృశ్య, శ్రవ్య, సమాహారమయిన నాటక ప్రక్రియ ప్రేక్షకులలో ఉత్తేజాన్ని లిగించి కార్యోన్ముఖలను ప్రథమ పాత్ర వహిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. అలాంటి నాటకం ఆనాటి పాలకుల నిషేదాస్త్రానికి గురికావడం అతిశయోక్తి కాదు. గాంధీజీ రంగ ప్రవ్వేశాం చేసిన తరువాత వలసపాలకుల నిషేదాజ్ఞలు మితిమీరాయి.
బ్రిటీషువారు దేశభక్తియుత నాటకాలను నిషేదించటానికి 'డ్రమెటిక్ పెర్ ఫార్మెన్స్' యాక్ట్ 1876 ను అమలులోకి తెచ్చింది. దీని ద్వారా మొదటిగా బెంగాల్ నాటకం 'నీల్ దర్పణ్' ను నిషేదించింది. దీని ద్వారానే 1921 జనవరి 26 న 'స్వరాజ్య సోపానము' అనే నాటకం నిషేదించబడింది. తరువాత దశలవారీగా ఆ యాక్టును సవరిస్తూ వచ్చింది.
వాటిలో ప్రధానమైనవి సెక్షన్ 124ఎ, 153ఎ, 99ఎ చట్టాలు. ఇవి డ్రామా ప్రదర్శనల చట్టం ద్వారా కళారూపాలను నిషేదించటం కోసం చేసినవి. ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో దేశభక్తి ప్రభోధించే నాటక ప్రదర్శన జరిగినా సర్కారు గూఢచారులు నివేదిక అందించేవారు. వెంటనే సర్కారు ఆ నాటకానికి సంబంధించిన అముద్రితమైన -ముద్రిత ప్రతినైనా స్వాధీనం చేసుకొని తద్వారా నటులకు, రచయితలకు, నాటకం అప్పటికప్పుడు ఆశువుగా ప్రదర్శించబడినా ఆ నాటకాన్ని రికార్డు చేసి దానిని ఇంగ్లీషు లోకి అనువాదం చేసి తద్వారా శిక్షలు అమలు జరిపేవారు.
తెలంగాణ ప్రాంతంలో మొట్ట మొదటగా నిషేదించబడిన దేశభక్తియుత పద్యనాటకం 'తిలక్ రాయభారం'. నాటకాన్ని వ్రాసినవారు సోమరాజు రామానుజరావుగారు. ఈ నాటకాన్ని ప్రచురించిన వారు దుమ్ముగూడెంలోని ఎస్.వేంకటేశ్వరా అండ్ కంపెనీవారు.
192 మార్చి 16 వ తేదీని ఆంధ్రపత్రికలో సోమరాజు రామానుజరావు గారు వ్రాసిన 'స్వరాజ్య రథము' నాటకం స్వభావ విశేషాలను గురించి ఒక వ్యాసం ప్రచురించారు. దాని ఆధారంగా స్వరాజ్య రథము నాటకాన్ని 1922 జూన్ 28వ తేదీన ప్రభుత్వం నిషేదించింది.
ఈ నాటకంలో తిలక్ రాయబారము ప్రతిజ్ఞాశకతాళీయము, పాంచాల పరాభవము, రామరాజ్య స్థాపనము, రథయాత్ర అనే ఐదంకాలున్నాయి. చివరి అంకెలో నటీనటులుందరు నిజంగానే ఒక రథం మీద ఆసీనులై గ్రామంలో రథయాత్ర జరిపేవారు. అలా జరుగుతున్న రథయాత్రలోనే రామానుజరావుగారిని అరెస్టు చేయటానికి ప్రయత్నించారు. అయితే ఆయన తప్పించుకొని రంగూన్ వెళ్ళి అక్కడ నుంచే ఆయన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ నాటకానికి వ్రాసిన ముందు మాటలో రామానుజరావుగారు ఇలా వ్రాసుకున్నారు. '"ఈ నాటకమును నేను వ్రాసిన స్వరూపమునకు పోలిక ఎక్కడా లేదు. నా వ్రాత ప్రతిని ముద్రించుటకు ముద్రాలయం వారు సర్కారు శాసన నిర్భంధమున వెనుదీయడం చేత దీనిని స్వరూపముతోడ బయటకు తీసుకొని వచ్చింతిని. నాటకమును ప్రదర్శించువారు కోరినచో వ్రాత ప్రతిని పంపెదను" ఈ వాక్యాలు ఆయన నిబద్దతను తెలియజేస్తున్నాయి.
మరొక ప్రసిద్ద రచయిత శ్రీ చుక్కభోట్ల సత్యనారాయణగారు రచించిన అనువాద నాటకం 'ఝాన్సీలక్ష్మీబాయి'. ఈ నాటకాన్ని 1931 జూన్ 8వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వం నిషేదించింది. ఐ.పి.సి. సెక్షన్ 99ఎ, 124ఎ, 53ఎ, ప్రకారం రాజద్రోహి అంశాలున్నాయనే ఆరోపణలతో ఈ నాటకాన్ని ప్రచురణకర్తతో పాటు రచయితను నిర్భంధం చేసింది. ఈ నాటకాన్ని ప్రచురించిన వారు దువ్వూరి సాంబమూర్తి. ఈ నాటకంలో 23 అభ్యంతరక్కర దృశ్యాలున్నాయని ప్రభుత్వం వివరించింది.
ఇలా నిషేదిత దేశభక్తియుత నాటిక బ్రహ్మశ్రీ బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రిగారు 1947 ప్రారంభంల వ్రాసిన చరిత్రాత్మక నాటిక ప్రతీకారం కటి. ఈ నాటిక 1966 లో స్వాతంత్ర్యానంతరం ప్రకటించబడింది.
అయితే ఈ నాటిక 1948 వ సంవత్సరంలో జంషెడ్ పూర్ నాటిక పోటీలలో ప్రథమ బహుమతి పొందింది.
ఇందుల ఐదు శకలాలున్నాయి. ఇందులో కథ పరిచయమయినదే అయినా కథ వినూత్నమైనది. స్థూలంగా ఇందులోని కథ 'రాజకుమారి సంయుక్త తండ్రి కోరికకు విరుద్ధంగా స్వయంవర మంటపంలో ద్వారము వద్ద విగ్రహ రూపంలో ఉన్న పృధ్వీరాజును వరిస్తుంది. దానికి కోపోద్రిక్తుడయిన జయచంద్రుడు సంయుక్తను కారాగారంలో బంధిస్తాడు. తరువాత తురుష్క చక్రవర్తి మహమ్మద్ ఘోరీతో చేతులు కలిపి పృద్వీరాజు మీద పగ తీర్చుకోవడానికి ఉపక్రమిస్తాడు'.