సూచన: ఈ క్రింది వ్యాస భాగమును చదివి ప్రశ్నలకు సరైన సమాధానములు రాయండి.
తెలుగులో వైజ్ఞానిక రచనలు ఆధునిక యుగంలోనే ప్రారంభమైనట్లుగా భావిస్తారు చాలామంది. కానీ వెయ్యేళ్లకు పూర్వమే ఇలాంటి రచనలు వెలువడ్డాయి. నన్నయ సమకాలికుడైన పావులూరి మల్లన రచించిన ' గణితసార సంగ్రహం' ప్రాచీన తెలుగు సాహిత్యంలోనే ఖ్యాతిగాంచిన వైజ్ఞానిక పద్య కావ్యం. సంస్కృతంలో మహావీరాచార్యుడి రచనకు ఇది తెలుగు అనువాదం. ఈ గ్రంథంలో అంకగణితం, క్షేత్రగణితం, బీజగణితం, గ్రహగమనాలు, గ్రహణకాల పరిగణనలు, అంతరిక్ష గోళాల కొలతలు తదితరాలను ప్రామాణికంగా చర్చించారు. తెలుగులో అపారమైన పద సంపద, అద్భుతమైన శబ్ద సౌందర్యమూ ఉంది. కాబట్టే మహాకవులు ఎన్నెన్నో మహాకావ్యాలకు ప్రాణప్రతిష్ఠ చేసారు. అలంకారిక కావ్యరచనకు అతీతంగా సాగే శాస్త్రసాహిత్య నిర్మాణానికి అవసరమైన వైజ్ఞానిక పదబంధాలను తెలుగులో ఆనాడే రూపొందించారు.
ఆనాటి శాస్త్ర వెలుగులు
ఆయుర్వేద సిద్ధాంతానుసారం వ్యాధుల విశ్లేషణ. వ్యాధి కారణాలు, నివారణ ఉపాయాలు, ఔషదాల వివరాలను అందిస్తూ ఎన్నో తెలుగు గ్రంథాలు మధ్యయుగాల్లోనే వెలువడ్డాయి ధేనుకొండ కేశవామాత్యుడి 'వైద్య చింతామణి ', గ్రంథి వెంకట సుబ్బరాయుడి ' ధన్వంతరి వైద్యలహరి ', మామిడివఝుల వేంకట కృష్ణశర్మ ' నాడీ విధానం' అలాంటి వాటిలో కొన్ని. ఇవన్నీ పద్యరూపంలో, వైద్య పరిభాషలో ఉంటాయి. పశువైద్యానికి సంబందించి కూడా అప్పట్లోనే వివిధ గ్రంథాలు వచ్చాయి. అడవి సాంబశివ కవి ' అశ్వలక్షణసారసంగ్రహం'లో గుర్రాల జాతులు, శరీర భాగాల రీతులు, వాటికొచ్చే వ్యాధులు, ఔషధాల సమాచారం ఉంది. 1935లో బుక్క సిద్ధాంతి అశ్వశాస్త్రాన్ని వచనంలో తెలంగాణ మాండలికంలో రచించారు.
సికింద్రాబాదులో ఆ గ్రంథం ప్రచురితమైంది. సంస్కృతంలో సహదేవుడు రచించిన పశువైద్య శాస్త్రానికి కూడా తెలుగులో పద్య, వచన అనువాదాలు వెలువపడ్డాయి. అలాగే రసాయనశాస్త్రం, ఔషధ విజ్ఞాన శాస్త్రాలకు సంబంధించి కూడా అనేక పద్య కావ్యాలు గతంలో వచ్చాయి. ముడుంబా వెంకటాచార్యుల ' రసప్రదీపిక, వీరశింభుడి ' సిద్ధసారం', కంటి వ్యాధుల చికిత్స గురించి చెప్పే తాడిపల్లి పానకాల రాయుడి 'నేత్ర దర్పణం' ఈ కోవకు చెందినవే. ఆహార విజ్ఞాన శాస్త్రం గురించి సంస్కృతంలో భోజుడు రాసిన 'చారుచర్య ' ను తెలుగులోకి అప్పన్న మంత్రి అనువదించాడు. కేవలం శాస్త్ర కావ్యాలే కాకుండా అలంకార కావ్యాల్లోనూ వైజ్ఞానిక అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఆంధ్ర మహాభారతం, రామాయణం, భాగవతం, పురాణాలు, ఇతర ప్రబంధాల్లోనూ ఖగోళ, భౌతిక, వృక్ష, వైద్య శాస్త్రాల ప్రసావనలున్నాయి.
తెలుగులో గత శతాబ్ది ప్రారంభం నుంచి వచన వైజ్ఞానిక రచనల ప్రచురణ ఊపందుకుంది. కొమర్రాజు వెంకట లక్షణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ఈ దిశగా తొలి అడుగు వేసింది. పదార్ధ విజ్ఞాన శాస్త్రం, ప్రకృతి శాస్త్రాలకు సంబంధించి ఈ సంస్థ స్వతంత్ర గ్రంథాలు, అనువాద గ్రంధాలు ప్రచురించింది. మొసలిగంటి రామాబాయమ్మ సంపాదకత్వంలో ' హిందూ సుందరి', గోపిశెట్టి నారాయణ స్వామి నాయుడు నేతృత్వంలో ' వ్యవసాయం ' అనే మాస పత్రికలు వెలువడి వైజ్ఞానిక ఉద్యమ వ్యాప్తికి తోడ్పడ్డాయి. పందొమ్మిదో శతాబ్దం చివరినాళ్లలో మహబూబ్ నగర్ నుంచి వచ్చిన ' సేద్య చంద్రిక ' పత్రిక కూడా వ్యవసాయ విజ్ఞానాన్ని వ్యాప్తి చేసింది. ఇదే కాలం నాటి ' చింతామణి' పత్రికలో కందుకూరి వీరేశలింగం వైజ్ఞానిక వ్యాసాలు చాలా రాసారు. 'జంతు స్వభావ చరిత్రము ' శీర్షికతో జీవశాస్త్ర సమాచారాన్ని తన ధారావాహిక వ్యాసాల్లో వివరించారాయన. ఆరోగ్య సంబంధిత విషయాల మీదా ఆయన రచనలు చేసారు. వల్లూరి నరసింహారాయుడు రాసిన భూగోళ, ఖగోళ శాస్త్ర వ్యాసాలూ ఈ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఇక ' సతీహిత బోధిని ' పత్రిక స్త్రీల శారీరక సమస్యలు-వాటికి పరిష్కార మార్గాలను సూచించే వ్యాసాలను అచ్చొత్తింది.